ఒకనాడు గోవులును గోపాలకులును గ్రీష్మకాలపు ఎండకు సహించలేక కాళిందీ దిలోని జలమును త్రాగి మరణించగా, కృష్ణుడు తన అమృత కాటాక్షముచే వారిని బ్రతికించి ఇందుకు కారణము ఆ దీమడుగులోనున్న కాళీయుడను సర్పముయొక్క విషమని గ్రహించెను. ఆ కాళీయుని చంపుటకుగాను ఆ నది ప్రక్కనున్న వృక్షమునెక్కి నదిలోకి దూకెను. ఆశబ్దమునకు కాళీయుడు పైకివచ్చి కృష్ణుని మర్మస్థానములలో కరచి శరీరమునంతనూ చుట్టుకొనెను. ఈ దృశ్యము చూచిన గోకులవాసు లందరూ కృష్ణుడు చనిపోవునేమో యని విలపించుచుండిరి. అంత కృష్ణుడు ఆ కాళీయుని బంధము తప్పించుకొని కాటు వేయుటకు సిధ్ధముగానున్న దానిపడగమీదికి దూకి విచిత్రతాండవము చేయ అపడగలన్నియూ శిధిలమై నెత్తురుకక్కుకొని కాళీయుడు కృష్ణునిశరుణుజొచ్చెను. అతని భార్యలు గూడ తమకు పతిభిక్ష పెట్టమని కృష్ణుని వేడుకొనిరి కృష్ణుడు వారియందు దయచూపి కాళీయుని ఆనదిలోనుండి లేచి సముద్రమధ్యమున ఉన్న ఒక ద్వీపమునకు పొమ్మని ఆజ్ఞాపించెను. అప్పటినుండే ఆ కాళిందీమడుగు విషరహితమై అమృత మధురజలముతో నొప్పారెను.
కాళియమర్దనమైనతరువాత ఆరాత్రి కృష్ణుడును బలరాముడును, గోపాలురతోడను గోవులతోడను కాళిందీతీరమున విశ్రమించి నిద్రించిరి. ఆసమయమున కార్చిచ్చు ఆ వనమునంతయూ తగులబెట్టగా గోపాలురు భయపడి కృష్ణుని శరణువేడిరి. అంత కృష్ణుడు భగవత్స్వరూపుడుగాన ఆకార్చిచ్చును మ్రింగివేసి వారిని రక్షించెను. తెల్లవారిన తరువాత వారందరునూ గోకులములకు తిరిగి వెళ్ళిపోయిరి.